సాగు చేస్తున్న పంటల వివరాలను “ఈ-పంట” (e-panta) వెబ్ సైట్ లో రైతులే స్వయంగా నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ‘ఈ-పంట’ (ecrop) లో పంటల నమోదును రైతు సేవా కేంద్రం సహాయకులు చేసేవారు.
రైతులు స్వయంగా ‘ఈ-పంట’ నమోదును ఎలా చేసుకోవాలి ?
- రైతులు వారి మొబైల్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి APAIMS 2.0 అనే మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఆధార్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి MPIN సెట్ చేసుకోవలెను.
- ఆధార్ నెంబర్ ఆధారంగా వెబ్ ల్యాండ్ తో అనుసంధానమైన రైతుకు చెందిన అన్ని భూకమతాలు ఆ యాప్ లో కనిపిస్తాయి.
- ఇప్పటి వరకు రైతు సేవా కేంద్రం సహాయకుడు పంట నమోదు చేయని భూములకు సంబంధించి కూడా రైతులే స్వయంగా నమోదు చేసుకోవచ్చు.
- పంట నమోదు సమయంలో 20 మీటర్ల జియో రిఫరెన్స్ హద్దులతో కూడిన పొలంలో ఫోటో తీసుకోవలెను. ఇందుకోసం రైతు తప్పనిసరిగా తన పొలంలోనే ఉండాలి.
- ఇలా నమోదు చేసిన సమాచారం సంబంధిత రైతు సేవా కేంద్రం సహాయకుడి ధృవీకరణకు వెళ్తుంది. పంట నమోదు స్థితిగతులపై ఆ రైతుకూ సమాచారం అందిస్తారు.
- ఈ యాప్ సహకారంతో రైతు సేవా కేంద్రం సహాయకుడు నమోదు చేసిన పంట వివరాలు సరిగా ఉన్నాయో లేదో కూడా పరిశీలించుకోవచ్చు.
- అవి సరిగ్గా లేకపోతే ఫిర్యాదు చేసే అవకాశమూ రైతులకు కల్పించారు.

